తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో సాగునీటి ప్రాజెక్ట్కు కేంద్రం నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వర ప్రదాయిని ఐన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం అటవీ, పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్.. ఖమ్మం చీఫ్ ఇంజినీరు సుధాకర్కు ఈ ఉత్తర్వులు పంపించారు.
ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించిన సందర్బంగా సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చెయ్యాలని అటవీ మంత్రి, అధికారులను కోరారు. తుది అనుమతుల కోసం ఇటీవలె ఢిల్లీలో జరిగిన పర్యావరణ మదింపు కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ అభ్యర్ధనను పరిశీలించిన అటవీశాఖ అన్ని అనుమతులు ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దాంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు పారనుంది.