రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలన్నారు సీఎం కేసీఆర్. వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొద్దని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలన్నారు సీఎం.
రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండకూడదని చెప్పారు. మేథోమథనం, అన్ని రకాల చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయనిపుణుల సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తోందని గుర్తు చేశారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారాయన.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని చెప్పారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు-విధానాలు-పథకాలు-కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యం కావాలని చెప్పారు కేసీఆర్.
ప్రధానంగా పాలనలో వేగం, ప్రజలకు మరింత చేరువకావడం, ప్రజల వినతులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థంగా అమలుచేయడం వంటి ప్రధాన అంశాలపై సీఎం చర్చలు జరిపారు. ముఖ్యంగా పురపాలక, పంచాయతీరాజ్చట్టాల అమలుతోపాటు కొత్త రెవెన్యూచట్టం, భూవివాదాలకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.