హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే, సాయంత్రం 5గంటల వరకు ఓటేసేందుకు గడువు ఉండటంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం 302 పోలింగ్ కేంద్రాల్లో హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలో సుమారు 2లక్షల 37వేల మంది ఓటర్లు ఉండగా ఇప్పటివరకు 70శాతానికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవతకవలకు తావులేకుండా ప్రతీ కేంద్రంలో వెబ్క్యాస్టింగ్తో పర్యవేక్షిస్తున్నారు.
హుజూర్నగర్ ఉపఎన్నిక పోలింగ్లో ఓటేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం నుంచీ పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరడంతో మధ్యాహ్నం ఒంటి గంటకే ఓటింగ్ 52శాతందాటింది. అయితే, ఇంతకుముందు ఇక్కడ 88శాతం పోలింగ్ నమోదు కావడంతో ఈసారి ఏ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇక, హుజూర్నగర్ బై-పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియోజకవర్గం మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 2వేల 350మంది సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, అదనంగా 6 కంపెనీల కేంద్ర బలగాలు, 5 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీసులు, 10 స్పెషల్ పార్టీ పోలీసులు, డాగ్ స్క్వాడ్స్ అండ్ టాస్క్ఫోర్స్, 7 క్విక్ రియాక్షన్ టీమ్స్ను రంగంలోకి దింపారు.