బాలిక కోరిక నెరవేర్చిన రాచకొండ పోలీసులు
-17 ఏళ్ల బాలిక కోరికను నెరవేర్చిన పోలీసులు -బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతోన్న రమ్య -రాచకొండ కమీషనర్ సాయాన్నికోరిన మేక్ ఎ విష్ పౌండేషన్ -రమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పోలీసులు
ఓ బాలిక కోరికను నెరవేర్చారు పోలీసులు. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతోన్న ఆ బాలిక కోరికను రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ తీర్చారు. కమీషనర్, మేక్ ఎ విష్ పౌండేషన్ సహాయంతో బాలిక ఒక్కరోజు పోలీస్ కమీషనర్ గా మారిపోయింది. పోలీసు కమిషనర్ అవతారం ఎత్తిన రమ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించింది. అనంతరం మహేష్ భగవత్ స్వయంగా ఆ బాలికని తన సీట్లో కూర్చొబెట్టి కమీషనర్గా ఎలాంటి విధులు నిర్వహించాల్సి ఉంటుందో వివరించారు. అనంతరం రమ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఓల్డ్ అల్వాల్కు చెందిన రమ్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఆమెకు పోలీస్ శాఖలో ఉన్నతోద్యోగం సంపాందించాలని కలలు కంటుండేది. అయితే ఈ కోరిక తీరకుండానే బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. దీంతో ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న మేక్ ఎ విష్ పౌండేషన్ రాచకొండ కమీషనర్ సాయాన్ని కోరారు. దీంతో బాలిక కోరిక నెరవేర్చేందుకు ఆయన ముందుకొచ్చారు. ఒక్క రోజు కమీషనర్గా రమ్య పోలీస్ డ్రెస్ లో విధులు నిర్వహించారు.ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రెండ్లీ పోలీసింగ్ తన కమీషనరేట్ పరిధిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా కమీషనర్ చిన్నారికి వివరించారు.