రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్రైజర్స్ 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బెయిర్ స్టో(114; 56 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(100 నాటౌట్: 55 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు)తో భారీ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరే 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్ 185 పరుగుల వద్ద 114 పరుగులు చేసిన బెయిర్ స్టో.. క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగుకు దిగిన విజయ్ శంకర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రన్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే యూసుఫ్ పఠాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో డేవిడ్ వార్నర్ స్కోర్ బోర్డు ను ఉరకలెత్తించాడు. మొత్తం 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.
ఇక 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఆటగాళ్లలో పార్థివ్ పటేల్(11), హెట్మెయిర్(9), విరాట్ కోహ్లి(3), ఏబీ డివిలియర్స్(1), మొయిన్ అలీ(2), శివం దూబే(5)లు ఘోరంగా విఫలమయ్యారు. అటు వచ్చి ఇటు పెవిలియన్కు చేరడంతో ఆర్సీబీ 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తరువాత గ్రాండ్ హోమ్(37), ప్రయాస్ రే బర్మన్(19)లు ఇన్నింగ్స్ చక్కదిద్దే పని చేపట్టారు.. వీరిద్దరూ ఏడో వికెట్కు 51 పరుగులు జత చేయడంతో ఆర్సీబీ 100 పరుగులు దాటింది. ప్రయాస్ రే ఔట్ అయిన తర్వాత ఉమేశ్ యాదవ్(14), చహల్(1)లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ఆర్సీబీ 19.5 ఓవర్లలో ఆలౌటైంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.