Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్ అవుట్..!
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేస్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం టోర్నమెంట్కే దూరమయ్యారు.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. కీలక ప్లేయర్ అవుట్..!
Team India Squad for Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేస్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మొత్తం టోర్నమెంట్కే దూరమయ్యారు. వెన్ను గాయం ఇంకా నయం కాకపోవడంతో బుమ్రాను జట్టు నుంచి తప్పించారు. గత నెలలో సిడ్నీలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి టెస్ట్లో బుమ్రా కింది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అప్పటి నుండి ఆటకు దూరంగా ఉన్నారు. అతని స్థానంలో సెలక్షన్ కమిటీ పేసర్ హర్షిత్ రాణాను 15 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక చేసింది.
ఇక లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో అద్భుత ఫామ్లో ఉన్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి ఎంపిక చేయగా, ఓపెనింగ్ బ్యాట్స్మన్ యశస్వి జైస్వాల్ను తప్పించారు. జైస్వాల్తో పాటు పేసర్ మొహమ్మద్ సిరాజ్, ఆల్రౌండర్ శివమ్ దూబే కూడా రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ గాయపడటంతో ఆడిన శ్రేయస్ అయ్యర్, జట్టులో స్థానం దక్కించుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు మ్యాచ్లు దుబాయిలో జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో, మార్చి 3న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇక బుమ్రా ఒకవేళ మళ్లీ ఫిట్నెస్ సాధిస్తే అది సెమీఫైనల్ లేదా ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఉన్నాయి. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో, ఫైనల్ మార్చి 9న జరగనుంది. భద్రతా కారణాల రీత్యా భారత్ పాకిస్థాన్లో ఆడేందుకు అంగీకరించలేదు. అందుకే ఐసీసీ టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు.
నిజానికి గాయం నుంచి బుమ్రా కోలుకుంటాడని సెలక్టర్లు ఆశించారు. ఇందులో భాగంగానే అతన్ని ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్కు ఎంపిక చేశారు. అయితే, బుమ్రా ఇంకా కోలుకోలేదు కాబట్టి చివరి వన్డేలో ఆడే అవకాశాన్ని కోల్పోయారు. బుమ్రాకు పూర్తిగా విశ్రాంతి అవసరం ఉందని, ఆరు వారాల పాటు అతను బౌలింగ్ చేయలేదని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ తుది జాబితాలో మార్పులు చేసేందుకు ఫిబ్రవరి 13 చివరి తేదీ. సెలక్షన్ కమిటీ మంగళవారం వర్చువల్గా సమావేశమైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్లు: యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివం దూబే. అవసరమైతేనే ఈ ముగ్గురు ఆటగాళ్లు దుబాయ్ వెళతారు.