అద్భుత శిల్పకళా వైభవం.. ముక్తేశ్వర ఆలయం

సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు భారత దేశం పెట్టింది పేరు. అంతే కాదు చారిత్రక కట్టడాలు ప్రఖ్యాతి గాంచిన ఆలయాలు ఎన్నెన్నో భారతీయ సంస్కృతికి అద్దం పడుతాయి.

Update: 2020-03-09 07:53 GMT

సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు భారత దేశం పెట్టింది పేరు. అంతే కాదు చారిత్రక కట్టడాలు ప్రఖ్యాతి గాంచిన ఆలయాలు ఎన్నెన్నో భారతీయ సంస్కృతికి అద్దం పడుతాయి. అలాంటి ఆలయాల్లో ముక్తేశ్వర దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయం గురించ తెలుసుకోవాలంటే అద్భుతమైన శిల్పకలతో ఈ ఆలయం వెలసింది. ఒడిషా రాష్ట్ర రాజధాని భుబనేశ్వర్ పట్టణంలోని 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం ఇది.

ఈ ఆలయం క్రీ.శ.950-975ల మధ్య నిర్మించబడింది. ఒరిస్సాలోని హిందూ దేవాలయాలలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఈ ఆలయం లోని శిల్ప సంపద అంతకుముందున్న ఆలయాలకంటే ఉన్నత స్థాయికి చేరుకుని తరువాత నిర్మించబడిన దేవాలయాలు రాజారాణీ దేవాలయం, లింగరాజ దేవాలయాలకు మార్గదర్శకంగా ఉంది. ఇది భువనేశ్వర్ నగరంలో ఒక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణగా నిలిచింది.

ఆలయ చరిత్ర

ముక్తేశ్వర దేవాలయం సోమవంశీకుల పరిపాలన తొలినాళ్లలో నిర్మించబడింది. ఈ ఆలయం పరశురామేశ్వర ఆలయం తరువాత, బ్రహ్మేశ్వర ఆలయానికి ముందు నిర్మించబడినట్లు పలువురు పండితుల అభిప్రాయం. పెర్సీ బ్రౌన్ ఈ ఆలయ నిర్మాణం క్రీ.శ.950లో ఆరంభమైనట్లు నిర్ధారించాడు. ఈ ప్రాంతంలోని దేవాలయాలలో లేని విధంగా ఈ దేవాలయానికి తోరణ ద్వారం ఉండడం కొత్త సంస్కృతికి దారితీసినట్లు భావిస్తున్నారు. కె.సి.పాణిగ్రాహి పరిశోధనల ప్రకారం ఈ దేవాలయం క్రీ.శ.966లో సోమవంశపు రాజు యయాతి.

ఆలయ నిర్మాణశైలి

ముక్తేశ్వర దేవాలయ ఆలయశిల్పకళ దానిని "జెమ్‌ ఆఫ్ ఒడిషా ఆర్కిటెక్చర్"గా పేరుపొందడానికి దోహదపడింది. ఈ ఆలయం లోతట్టు ప్రదేశంలో ఆలయ సముదాయం నడుమ పశ్చిమాభిముఖంగా నిర్మితమైంది. ఈ ఆలయంలోని జగన్మోహన మండప గోపురం మొదటిసారిగా సాంప్రదాయ రెండంతస్థుల నిర్మాణానికి బదులుగా పిరమిడ్ ఆకృతిలో కట్టబడింది. ఈ ఆలయం భువనేశ్వర్‌లోని ఇతర పెద్ద దేవాలయాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నది. దీని చుట్టూ అష్టభుజాకృతిలో విస్తారమైన శిల్పాలు చెక్కబడిన ప్రాకారం ఉంది.

ఈ ఆలయనిర్మాణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అంతకుముందు లేని క్రొత్తకొత్త నమూనాలతో నిర్మించబడినట్లు వాటిని తరువాత నగరంలో నిర్మాణమైన దేవాలయాలు అనుసరించినట్లు భావిస్తారు. ఈ దేవాలయానికి "తోరణం" అని పిలవబడే తలవాకిలి ఉంది. ఇది ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారానికి ద్వారంగా పనిచేస్తున్నది. ఈ ఆలయంలో విమానము, ముఖశాల అనే రెండు ప్రధాన కట్టడాలు ఉన్నాయి. ఇవి ఎత్తైన అరుగుపై కట్టబడ్డాయి.


తోరణం

ఈ దేవాలయంలో ముఖ్యమైన ఆకర్షణ తోరణ స్తంభము. దీని నిర్మాణంలో బౌద్ధ ఆలయ నిర్మాణశైలి ప్రభావం కనిపిస్తున్నది. ఈ కమానుకు వెడల్పాటి స్తంభాలున్నాయి. వాటికి ఆభరణాలతో అలంకరింపబడిన స్త్రీ మూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఇంకా ఈ స్తంభాలపై కోతులు, నెమళ్ల బొమ్మలున్నాయి. ఈ కమాను ముందు నుండి చూసినా వెనుక నుండి చూసినా ఒకే విధంగా ఉంది.

విమాన గోపురం

ఈ ఆలయపు "విమానం" అడుగు చతురస్రాకారంతో ఉండి నాలుగు ముఖాలు కుడ్యస్తంభాలతో కట్టబడి ఉంది. ఇతర దేవాలయాలతో పోలిస్తే దీని "శిఖరం" చిన్నగా ఉంది. నాలుగు వైపులా నాలుగు నటరాజ విగ్రహాలు, నాలుగు కృత్తిముఖాలు ఉన్నాయి. శిఖరపు పై భాగంలో కలశం ఉంది. శిఖరం 34 అడుగుల ఎత్తుండి అణువణువునా శిల్పాకృతులతో అలంకరించబడింది.

గర్భగుడి

గర్భగుడి చుట్టూ లోపలి భాగంలో గోడలపై అందమైన కన్నెల బొమ్మలు, నాగులు, నాగినులు పెనవేసుకున్న శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి లోపలిభాగం ఘనాకృతిలోను వెలుపల స్థూపాకృతిలోనూ ఉంది.

జగ్మోహన మండపం

జగన్మోహన మండపం 115 అడుగుల ఎత్తు వుండి విశ్వకర్మ మోహరన శిల్పులచే చెక్కిబడిన శిల్పాలతో సుశోభితం అయ్యింది. ఈ మండపం ఎర్రని ఇసుకరాయితో నిర్మించబడి సాధువుల, శృంగార స్త్రీల బొమ్మలు చెక్కబడివున్నాయి. చండప్రచండుల విగ్రహాల ప్రక్కన గంగ, యమున విగ్రహాలు చెక్కబడివున్నాయి. ఈ మండపానికి ఎదురుగా తోరణద్వారం ఉంది. గజలక్ష్మి, రాహు,కేతు విగ్రహాలు కూడా ఈ మండపగోడలపై చెక్కబడి ఉన్నాయి. సింహం తనకాళ్ళపై కూర్చొని వున్న బొమ్మ పై భాగాన ఉంది. బయటి గోడలపై నాగులు, నాగినుల బొమ్మలు చెక్కబడ్డాయి.


ఆలయం చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలు

గర్భగుడి ద్వారంపై హిందూ పురాణాల ప్రకారం తొమ్మిదవ గ్రహమైన కేతువు యొక్క విగ్రహం మూడు పడగల నాగుపాముతో కలిపి ఉంది. ఈ ఆలయం నైరుతి దిక్కులో ఒక కోనేరు (మారీచకుండం) ఉంది. దీనిలో మునిగితే స్త్రీలకు సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఇంకా ఈ ఆలయ ప్రాకరంలో కొన్ని శివాలయాలున్నాయి. ఈ ఆలయం తక్కువ ఎత్తుకలిగిన ప్రాకారాన్ని కలిగి ఉంది. ఈ దేవాలయం లోపలివైపు, వెలుపలివైపు శిల్పాలతో నిండివుంది.

ఆలయ ప్రాధాన్యత

ఈ దేవాలయంలోని శివుని ఆరాధిస్తే ముక్తి లభిస్తుందని కాబట్టి ఈ దేవునికి ముక్తేశ్వరుడనే పేరు ఉందని అంటారు. ఈ ఆలయ కుడ్యాలపై యోగాభ్యాసానికి చెందిన అనేక భంగిమలు చెక్కబడిబడి ఉన్నాయి. తాంత్రిక విద్యలకు ఈ దేవాలయాన్ని కేంద్రంగా కొందరు ఋషులు భావిస్తారు. ఈ దేవాలయం ప్రాకారానికి బయటివైపు సరస్వతి, గణేశ విగ్రహాలతోపాటు పాశుపతశైవాచారపు వ్యవస్థాపకుడు లకులీశుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం గొడ్రాళ్లయిన స్త్రీలు ఈ ఆలయసమీపంలోని "మారీచకుండం"లో రథోత్సవం జరిగే అశోకాష్టమి ముందురోజు స్నానంచేస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు. రథోత్సవం జరిగిన రోజు రాత్రి ఈ కుండంలోని నీటిని భక్తులకు విక్రయిస్తారు.


ఆకర్షణీయాంశాలు

ఒడిషా రాష్ట్రప్రభుత్వం పర్యాటక శాఖ ప్రతియేటా ఈ ఆలయ ప్రాంగణంలో "ముక్తేశ్వర నాట్యోత్సవాల"ను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలలో ప్రఖ్యాతిగాంచిన ఒడిస్సీ నృత్య కళాకారులు, కళాకారిణులు తమ నృత్యాలతో అలరిస్తారు. 

Tags:    

Similar News