తిరుపతి కపిలేశ్వర ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం
తిరుపతి కపిలేశ్వర ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం రేపు వైభవంగా రుద్రయాగం నిర్వహించనున్న టీటీడీ
( తిరుమల, శ్యామ్ నాయుడు )
ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి (చండీయాగం) హోమం బుధవారం వైభవంగా ముగిసింది. పవిత్ర కార్తీకమాసం సందర్భంగా కపిలేశ్వరాలయంలో టీటీడీ శాస్త్రోక్తంగా ఈ నెల 3వ తేదీ నుండి నిర్వహిస్తున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 5 నుంచి 13వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి జరుగనుంది.
ఇక రేపు అనగా నవంబరు 14 నుంచి 24వ తేదీ వరకు రుద్రయాగాన్ని టీటీడీ నిర్వహించనుంది. యాగంలో పాల్గొనదలచిన భక్తులు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చని టీటీడీ ప్రకటించింది. ఇవాళ ముగిసిన చండీయాగం. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కామాక్షి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.