China Skyscraper Pig Farm : ఒకే బిల్డింగ్లో 12 లక్షల పందులు..వాటి బిల్డింగ్ ఖరీదు అక్షరాలా రూ.54వేల కోట్లు
ఒకే బిల్డింగ్లో 12 లక్షల పందులు..వాటి బిల్డింగ్ ఖరీదు అక్షరాలా రూ.54వేల కోట్లు
China Skyscraper Pig Farm : చైనా వాళ్లు ఏదైనా చేశారంటే అది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. సాధారణంగా మనం కోళ్ల ఫారాలు, గొర్రెల ఫారాలు అంటే ఊరి చివర రేకుల షెడ్లలో ఉండటం చూస్తుంటాం. కానీ చైనా ఏకంగా పందుల కోసం ఒక భారీ ఆకాశహర్మ్యాన్ని నిర్మించింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్లో ఉన్న ఎజౌ నగరంలో 26 అంతస్తుల భారీ భవనంలో పందుల ఫారాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ బిల్డింగ్ పిగ్ ఫార్మ్గా రికార్డు సృష్టించింది. ఒకేసారి 12 లక్షల పందులు నివసించేలా ఈ అపార్ట్మెంట్ను డిజైన్ చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే, చైనా టెక్నాలజీలో ఎంత ముందుందో అర్థమవుతుంది. దాదాపు 54 వేల కోట్ల రూపాయల (సుమారు 600 మిలియన్ డాలర్లు) భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. చైనాలో పంది మాంసానికి ఉన్న విపరీతమైన డిమాండ్ను తట్టుకోవడానికి ఈ భారీ అపార్ట్మెంట్ను నిర్మించినట్లు ది గార్డియన్ నివేదిక వెల్లడించింది. బయట నుంచి చూస్తే ఇది ఏదో ఐటీ కంపెనీనో లేదా లగ్జరీ అపార్ట్మెంటో అన్నట్లుగా ఉంటుంది కానీ, లోపల మాత్రం లక్షలాది పందులు నివాసం ఉంటున్నాయి.
A 600 million dollar 26 story skyscraper housing 1.2 million pigs.pic.twitter.com/xW0IuuDBYb
— Massimo (@Rainmaker1973) March 1, 2026
ఈ 26 అంతస్తుల భవనంలో పందుల కోసం అధునాతన సౌకర్యాలు కల్పించారు. లోపల గాలి వెలుతురు, ఉష్ణోగ్రత, గ్యాస్ కంట్రోల్ కోసం సెన్సార్లతో కూడిన హైటెక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పందులకు ఆహారం పెట్టడానికి మనుషుల అవసరం లేకుండా 30 వేల ఆటోమేటిక్ ఫీడింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. కేవలం ఒక బటన్ నొక్కితే చాలు.. అన్ని పందులకు ఏకకాలంలో ఆహారం అందుతుంది. ప్రతి అంతస్తు ఒక స్వతంత్ర ఫామ్ లాగా పనిచేస్తుంది, తద్వారా వ్యాధులు ఒకదాని నుంచి ఇంకొక దానికి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఈ వింత ఫారమ్పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు చైనా ఇంజనీరింగ్ తెలివిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం జంతువులను ఇలా ఇరుకైన గదుల్లో ఉంచి మాంసం కోసం పెంచడం క్రూరత్వమని విమర్శిస్తున్నారు. పందులను లిఫ్టుల ద్వారా పై అంతస్తులకు తీసుకెళ్లడం, అవి కిందకు రాకుండా అక్కడే పెరిగి పెద్దవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా, ఆహార ఉత్పత్తి రంగంలో చైనా వేసిన ఈ అడుగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.