కర్నాటకలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. తీసుకున్న అప్పు తీర్చలేదని ఓ మహిళను నడిరోడ్డుపై విద్యుత్ స్తంభానికి కట్టేసి అమానుషంగా ప్రవర్తించారు. కొడిగిహళ్లిలో జరిగిన ఈ దారుణం కర్నాటకలో తీవ్ర సంచలనం రేపుతోంది. కర్నాటక చామరాజనగర్ జిల్లా కొడిగిహళ్లిలో చిన్న హోటల్ నడుపుకుంటోన్న రాజమణి స్త్రీ శక్తి పొదుపు సంఘం నుంచి 11లక్షల రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా ఊరి నుంచి పారిపోయిందంటూ కొందరు గ్రామస్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నెలరోజుల తర్వాత గ్రామానికి వచ్చిన మహిళను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. చెప్పులు, చీపుర్లతో కొడుతూ అవమానించారు.
అయితే అటుగా వెళ్తున్న వారంతా చోద్యం చూశారే తప్ప నిస్సహాయస్థితిలో ఉన్న బాధితురాలిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ దుర్మార్గులను ఆపేందుకు ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. ఈ దారుణాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.