సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది. కేసు పురోగతికి సంబంధించిన నివేదికతో సంబంధిత సీబీఐ అధికారి తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మధ్యాహ్నంలోగా అత్యాచార ఘటన, బాధితురాలి ప్రమాదం కేసు వివరాలు తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి అన్ని కేసులు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేస్తామని న్యాయస్థానం వెల్లడించింది.
ఉన్నావ్ బాధితురాలిపై హత్యాయత్నం ఘటనపై ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్, ఆయన బంధువులతో సహా 9 మందిపై సీబీఐ కేసు నమోదుచేసింది. అలాగే తనకు తనకు రక్షణ కల్పించాలని బాధితురాలి కుటుంబం సీజేఐ రంజన్ గొగొయ్కి రాసిన లేఖను సుమోటాగా తీసుకున్న న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. అయితే సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఈ కేసుని విచారిస్తున్న సీబీఐ అధికారి లక్నోలో ఉన్నాడని మధ్యాహ్నంలోగా రావడం అసాధ్యం అని తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సీబీఐ డైరెక్టర్ సదరు అధికారితో ఫోన్లో మాట్లాడి తమకు వివరాలు అందజేయాలని ఆదేశించింది.