శాసన మండలి సభ్యునిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది. ఆయనతో పాటు మరో ఎనిమిదిమంది సభ్యులు కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు వెల్లడించారు. వారిలో శివసేన తరుఫున ఒక్కరు, బీజేపీకి చెందిన నలుగురు, ఎన్సీపీ తరఫున ఇద్దరు, కాంగ్రెస్కు చెందిన ఒకరు ఉన్నారు.
మహారాష్ట్రలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కీలక మలుపుల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీ అండతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన ఏ సభకూ పోటీ చేయకుండానే ఈ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఉద్ధవ్ సీఎంగా కొనసాగాలంటే.. మే 27లోపు ఉద్ధవ్ ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీ గానీ గెలుపొందాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఉద్ధవ్ శాసన మండలిలోకి అడుగుపెట్టారు.