ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
* ఉ.11 గంటలకు 2 నిమిషాల పాటు మౌనం పాటించాలన్న కేంద్రం * అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోంశాఖ లేఖ * ఎక్కడ వీలైతే అక్కడ లేచి నిలబడి మౌనం పాటించాలని ఆదేశం
Representational Image
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసింది.
అయితే ఇది కొన్ని కార్యాలయాలకే పరిమితం అవుతూ వస్తోందని, ప్రజలంతా రోజువారీ పనుల్లో నిమగ్నమవుతూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని విస్మరిస్తున్నారని హోంశాఖ అభిప్రాయపడింది. ఈ ఏడాది దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలను సూచించింది.
ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు అన్ని రకాల పనులు, కదలికలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఎక్కడ వీలైతే అక్కడ లేచి నిలబడి మౌనం పాటించాలని తెలిపింది. మౌనం ప్రారంభించే ముందు, ముగింపు సమయాల్లో సైరన్లు, సైనిక తుపాకుల శబ్దం వినిపించాలని సూచించింది. ఒక వేళ సైరన్లు, తుపాకుల శబ్దాలు అందుబాటులో లేకపోయినా మౌనం పాటించాలని స్పష్టం చేసింది. ఎక్కడా కొవిడ్-19 నిబంధనలను విస్మరించకూడదని తెలిపింది.