తబ్లిగీ జమాత్ మర్కజ్ నేత మౌలానా సాద్ ఇవాళ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. మర్కజ్ కేసులో ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నానని, ఆ విచారణలో మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ లేఖలో తెలిపారు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు ఇవ్వాలని కోరాడు. ఎఫ్ఐఆర్లో ఏవైనా కొత్త సెక్షన్లు జత చేసినట్లయితే తనకు తెలియజేయాలని పోలీసులను కోరాడు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ జమాత్ ఈవెంటే కారణమని ఆరోపణలు వచ్చాయి. పైగా ఇందులో పాల్గొన్నవారిలో చాలామందికి అప్పటికే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నప్పటికీ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందింది. అయితే ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసును పెట్టారు. అయితే పోలీసుల ముందుకు రాకుండా మౌలానా సాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మౌలానా సాద్ ఎట్టకేలకు దిగొచ్చారు. విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు.