దివంగత మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ చివరి కోరికను ఆమె కుమార్తె బన్సూరి నెరవేర్చారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ కేసు వాదించి గెలిచినందుకు న్యాయవాది హరీశ్ సాల్వేకు సుష్మా ఇవ్వాల్సిన రూ.1 ఫీజును బన్సూరి చెల్లించారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్భూషణ్ జాదవ్ తరఫున హరీశ్ వాదించి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఆయన ఒక రూపాయి ఫీజు పుచ్చుకుంటానని గతంలో సుష్మాతో అన్నారు. ఈ నేపథ్యంలో చనిపోవడానికి కేవలం గంట ముందు సుష్మా స్వరాజ్ హరీశ్తో మాట్లాడారు. 'మీరు కేసు గెలిచారు.. మీకివ్వాల్సిన ఫీజు రూ.1 తీసుకెళ్లండి' అని చెప్పారు అంటూ హరీశ్ గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత గంట సేపటికే ఆమె గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో నిన్న బన్సూరి స్వరాజ్, హరీశ్ సాల్వేకు ఆయన ఫీజు చెల్లించారు. తల్లి కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.