పూరిలోని శ్రీజగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూరీ వీధులన్నీ భక్తజన కోటితో కిటకిటలాడుతున్నాయి. ఈ యాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా శ్రీజగన్నాథ పుణ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు.
పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే పెద్దవీధిమీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత లాంటి ప్రాచీన గ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన ఉంది.
ప్రపంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. దీని కోసం ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయాలన్నింటికీ పూరీ జగన్నాథాలయం మినహాయింపు. బలభద్ర, సుభద్రల సమేత జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. కాబట్టే జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు.