అలుపెరగని పోరాట యోధుడు, ప్రఖ్యాత సోషలిస్టు దిగ్గజం, కేంద్ర మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) మరణించారు. గతకొన్నాళ్లుగా అల్జీమర్స్ వ్యాధితో బాధ పడుతున్న ఆయనకు ఇటీవల స్వైన్ ఫ్లూ సోకింది. దాంతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో మరణించినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. పోరాటమే జీవితంగా, జీవితమే పోరాటంగా భావించిన ఫెర్నాండెజ్ స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో మచ్చలేని నేత, నిరాడంబరుడు, నిగర్వి. హక్కుల సాధనకు పరితపించిన మహోన్నత వ్యక్తి ఆయన. రెండు విభిన్న భావజాలాల నేతృత్వాల్లోని ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు. 1974లో రైల్వే సమ్మెతో దేశాన్ని స్తంభింపజేసిన కార్మిక నేతగా.. 1977లో బడా బహుళ జాతి సంస్థ కోకకోలాను దేశం వదిలివెళ్లేలా చేసిన కేంద్రమంత్రిగా.. 1999లో కార్గిల్ యుద్ధాన్ని, అణ్వస్త్ర పరీక్షలను పర్యవేక్షించిన రక్షణ మంత్రిగా ఫెర్నాండెజ్ చరిత్ర పుటల్లో నిలిచారు.
ఆయన హయాంలోనే కొంకణ్ రైల్వే రూపుదిద్దుకుంది. రెండుసార్లు రక్షణ మంత్రి అయిన ఆయనను దివంగత ప్రధాని వాజ్పేయి.. ఆయనను ఎన్డీయేకు కన్వీనర్గా నియమించారు. కాగా అమెరికాలో ఉంటున్న జార్జి ఫెర్నాండెజ్ కుమారుడు సియాన్ ఫెర్నాండెజ్ వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. ఫెర్నాండెజ్ పార్థివ దేహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణ మంత్రి నిర్మల సీతారామన్, బిహార్ సీఎం నితీశ్కుమార్, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు కూడా ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.