Odisha: దారుణం..ఇంజక్షన్ వికటించి ఆరుగురు దుర్మరణం..!!
Odisha: ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరోగురు రోగులు ఇంజక్షన్ వికటించి మరణించారు. మరణించినవారంతా వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందినవారే. రోగులు గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరికి సర్జరీలు జరిగాయి. సర్జరీ విజయవంతం అయ్యింది. ఈ క్రమంలోనే ఆరుగురు రోజుగులకు ఒకే బ్యాచ్ కు చెందిన ఇంజక్షన్లు ఇచ్చారు. వాటిని వేసి కొద్ది నిమిషాల్లోనే రోగులు ఊపిరి ఆడక విలవిలా కొట్టుకున్నారు. వెంటనే పరిస్థితిని గమనించి ఐసీయూకి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. విషయ తీవ్రతను గమనించిన ఆసుపత్రి సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
కోరాపుట్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరుగురు మరణించిన ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత ఇంజక్షన్ బ్యాచ్ ను సీజ్ చేసి ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతానికి ఉన్నతాధికారులు ఆసుపత్రి డాక్టర్లు, నర్సులను విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, మరణించివారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమవారు మరణించారని బంధువులు ఆందోళనకు దిగారు.
అధికారులు మరణించినవారి బంధువులతో సంప్రదింపులు జరిగి డెడ్ బాడీలకు పోస్టు మార్టం నిర్వహించారు. 10 మంది వైద్య బ్రుందం పోస్ట్ మార్టం ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రభుత్వం వైద్యం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు , శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ సిబ్బందిని మోహరించారు. ఆసుపత్రి న్యాయమైన విచారణకు హామీ ఇచ్చినప్పటికీ ఈ ఘటన ఒడిశాలో ప్రజారోగ్య సంరక్షణ గురించి చాలా కాలంగా ఉన్న ఆందోళనలను మరోసారి తెరపైకి తెచ్చింది. దక్షిణ ఒడిశాకు కీలకమైన వైద్య సదుపాయమైన SLNMCH, సిబ్బంది కొరత, అస్థిరమైన వైద్య విధానాలు, సరిపోని మౌళిక సదుపాయాలపై గతంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.