Budget 2020: నవభారత్ నిర్మాణమే లక్ష్యం.. పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి

Update: 2020-01-31 06:09 GMT
నవభారత్ నిర్మాణమే లక్ష్యం.. పార్లమెంట్ ఉభయసభల్లో రాష్ట్రపతి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. మొదట రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరిన రామ్ నాథ్ కోవింద్‌కు పార్లమెంట్ ఆవరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యా నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఘన స్వాగతం పలికారు.

గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఆశయాలను ప్రజలు నెరవేర్చాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కల్పించామన్నారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త చట్టాలు ఎన్నో తీసుకొచ్చామన్నారు. నవ భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మనమంతా కలిసి ముందడుగు వేయాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

సీఏఏకు సంబంధించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. గాంధీ కలగన్న సీఏఏ ఆయన 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నెరవేరిందన్నారు. ఈ సమయంలో అధికార పక్షం నేతలు బల్లలు చరచగా విపక్షాలు పెద్దగా నినాదాలు చేశాయి.

రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రారంభానికి ముందు విపక్షాలు సమావేశమయ్యాయి. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం విపక్ష నాయకులు పార్లమెంట్ ఆవరణలో ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు.  

Tags:    

Similar News