ప్రముఖ నటుడు రిషి కపూర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ను ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. క్యాన్సర్తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు రిషీకపూర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విట్టర్ ద్వారా రిషీ కపూర్ మరణంపై స్పందించారు. ''బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప వ్యక్తి రిషీ కపూర్. ప్రతిభావంతుడు. మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను ఆయన తరచూ గుర్తు చేస్తుండేవారు. అలాగే సోషల్మీడియా వేదికగా కూడా మేమిద్దరం సంభాషించుకునేవాళ్లం. సినిమాల పట్ల, భారతదేశ వృద్ధి పట్ల ఆయన ఎంతో ఆసక్తి కనబరిచేవారు. ఆయన ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను'' అని ప్రధాని ట్వీట్ చేశారు.