బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో తుదశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కొన్నాళ్లు లండన్లో చికిత్స కూడా తీసుకున్నారు. చివరి సారిగా అయన "ఆంగ్రేజీ మీడియం'' చిత్రంలో నటించారు.
కాగా.. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ ఖాన్ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఇర్ఫాన్ విలక్షణ నటుడని, వివిధ భాషలకు చెందిన సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇర్ఫాన్ భౌతికంగా దూరమైనా వివిధ సినిమాల్లో చేసిన అద్భుత ప్రదర్శనల ద్వారా ఆయన ఎప్పుటికీ మనకు గుర్తిండిపోతారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇర్ఫాన్ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.