అజ్ఞాతంలోకి కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన తన ఇంట్లో లేకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు ఇంటి గోడపై నోటీసులు అంటించి వెనుదిరిగారు.
కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన తన ఇంట్లో లేకపోవడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు ఇంటి గోడపై నోటీసులు అంటించి వెనుదిరిగారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న చిదంబరంకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిన్న ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో తమముందు హాజరుకావాలంటూ చిదంబరంకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ, ఈడీ అధికారులు నిన్ననే ఆయన ఇంటికి వచ్చారు. దీంతో చిదంబరం ఏ క్షణాన్నైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరమే సూత్రధారి అని సీబీఐ వాదిస్తోంది. తమ కస్టడీలో ఉంచి ఇంటరాగేట్ చేయాల్సిందే అని సీబీఐ వాదిస్తోంది. ఇలాంటి వారందరికీ బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పుకొచ్చింది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే చిదంబరం సుప్రీం తలుపుతట్టారు. అయితే చిదంబరం పిటిషన్ను తక్షణం విచారించేందుకు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిరాకరించారు. దీంతో చిదంబరం అప్పీలు స్వీకరణపై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీంతో చిదంబరం ఇవాళ సుప్రీంకోర్టుకు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే చిదంబరం లేకపోవడంతో ఆయన కోసం గాలిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.