యావత్ భారతదేశం ప్రస్తుతం కర్ణాటకవైపే చూస్తోంది. క్షణం క్షణం మారుతున్న రాజకీయ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఫ్లోర్ టెస్ట్ నేడు జరుగుతుందా ..జరగదా ? గవర్నర్ ఆదేశించినట్లుగా ఈ రోజు మధ్యాహ్నం 1.30 లోపు కుమారస్వామి శాసన సభలో బలం నిరూపించుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. కర్ణాటకలో హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ వాజూభాయ్ వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి డెడ్లైన్ పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ సూచించారు. సీఎంకు ఓ లేఖ రాశారు.
గురువారమే విశ్వాసపరీక్షను ముగించాలని గవర్నర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ స్పీకర్ పాటించకపోవడంపై బీజేపీ పక్ష నేత యడ్యూరప్ప తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభను వాయిదా వేయడం సరైన చర్య కాదని పేర్కొన్న బీజేపీ సభ్యలు.. సభ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనతోపాటు పార్టీ సభ్యులంతా రాత్రంతా శాసన సభలోనే ఉంటామని.. ఇక్కడే నిద్రిస్తామని యడ్యూరప్ప తేల్చి చెప్పిన బీజేపీ బృందం రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ వ్యవహారం కూడా మలుపులు తిరుగుతోంది. పాటిల్ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ గురువారం కర్ణాకట అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సభ్యుడు దినేష్ గుండూరావు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ సైతం సభలో ప్రస్తావించారు. శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. తనతో పాటు దేవనహళ్లిలోని ప్రకృతి రిసార్ట్స్లో ఉన్న శ్రీమంత్ పాటిల్ను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని డీకే శివకుమార్ ఆరోపించారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియో విడుదల చేశారు. అనేక మలుపులు తిరుగున్న ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఫ్లోర్ టెస్ట్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా విప్ విషయంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.