ఇరుదేశాల మధ్య సామరస్యానికి చిహ్నం సిక్కుల పవిత్ర క్షేత్రమైన కర్తార్పూర్ కారిడార్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇరుదేశాల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిక్కుల చిరకాల స్వప్నమైన కర్తార్పూర్ దర్బార్ సాహిబ్ గురుద్వారా దర్శనానికి వీలు కల్పించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కారిడార్ ఎట్టకేలకు జాతికి అంకితమైంది. ప్రస్తుతం దర్శనం కోసం లాహోర్ వెళ్లి, అక్కడి నుంచి కర్తార్పూర్ వెళ్లాల్సి వస్తుండగా, ఇప్పుడు వీసా లేకుండా పాక్ భూభాగంలోకి వెళ్లి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని వచ్చే వీలు కలిగింది.
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పంజాబ్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాలో పూజలు నిర్వహించారు. కారిడార్ ప్రారంభోత్సవంతో కర్తార్పూర్ సాహిబ్కు యాత్రికులు వెళ్లేందుకు వీలు కలిగింది. ముందుగా వెళ్లే యాత్రికుల బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కెప్టెన్ అమరీందర్సింగ్ కూడా ఉన్నారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన కర్తార్పూర్ కారిడార్ను పంజాబ్లోని డేరా బాబా నానక్ గురుద్వారా నుంచి పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న కర్తార్పూర్లో ఉండే గురుద్వారా వరకు నిర్మించారు. ఇందుకు సంబంధించి భారత్, పాకిస్థాన్ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. రెండు దేశాల ప్రతినిధులూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పంజాబ్ నుంచి ప్రధాని మోడీ, పాకిస్థాన్ వైపు నుంచీ అక్కడి ప్రధాని ఇమ్రాన్ఖాన్ కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభించారు.
భారత్ నుంచి సిక్కులు కర్తార్పూర్ గురుద్వారా సందర్శనకు ఏటా నాలుగుసార్లు వెళుతుంటారు. ఒకటి బైశాఖి పండగ సందర్భంగా. రెండు సిక్కుల ఐదో గురువు అర్జున్దేవ్ అమరుడైన రోజు. మూడు మహారాజా రంజిత్సింగ్ వర్ధంతి నాడు. నాలుగు గురునానక్దేవ్ జయంతి రోజు. ఈ నాలుగు సందర్భాల్లో మన దేశం నుంచి పాకిస్థాన్లోని అన్ని గురుద్వారాలకూ వెళ్లేందుకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు కర్తార్పూర్ కారిడార్ పూర్తికావడంతో పాస్ పోర్టులు, వీసాలు లేకుండానే యాత్రలో పాల్గొనేందుకు వీలుంటుంది.
రావినది ఒడ్డున ఉన్న కర్తార్పూర్లో గురునానక్ నిర్మించిన గురుద్వారా సిక్కులకు పవిత్ర ప్రదేశం. దేశ విభజనతో పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్ పంజాబ్రాష్ట్రం గురుదాస్పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇండోపాక్ ఇంటర్నేషనల్బోర్డర్ నుంచి మూడుకిలోమీటర్లు వెళితే ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఈ మార్గంలో కారిడార్ నిర్మాణానికి గత ఏడాది నవంబర్ 26న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రెండురోజుల తర్వాత పాక్ప్రధాని ఇమ్రాన్ఖాన్శ్రీకారం చుట్టారు. ఈ కారిడార్నిర్మాణం పూర్తి కావడంతో... రెండు దేశాల ప్రధానులు ఆడంబరంగా ప్రారంభించారు.
వివిధ దేశాల భక్తులు గురుద్వారాకు బస్సుల్లో వెళ్లేటప్పుడు పాకిస్థాన్ రేంజర్లు ఆర్మీ కాన్వాయ్తో భద్రత కల్పిస్తారు. దేశ విభజన వల్ల 1947లో మనవాళ్లు ఈ ప్రదేశానికి రాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం రోడ్డు మూసి వేసింది. దీంతో బోర్డర్వద్దకు వెళ్లి టెలిస్కోప్తో చూడాల్సి వచ్చేది. రిపేర్లు, రినోవేషన్ తర్వాత గురుద్వారాను 1999లో రీఓపెన్చేశారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో లాహోర్కి బస్సు యాత్ర నిర్వహించారు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ, గతేడాది కర్తార్పూర్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించింది.