ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనదారులకు విధిస్తున్న భారీ జరిమానాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమర్థించారు. తన వాహనానికి కూడా భారీ జరిమానా విధించారన్నారు. తాను ఆ జరిమానాను చెల్లించినట్టు వెల్లడించారు. ముంబైలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. దేశంలో రోడ్ల భద్రత మరింత మెరుగుపరచేందుకు జాతీయ రహదారుల వెంబడి 786 'బ్లాక్ స్పాట్స్'ను గుర్తించామని, 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్లు బోగస్వని కూడా గుర్తించామని గడ్కరి చెప్పారు. ట్రాఫిక్ అధికారులు ఎవరిపై వివక్ష చూపరని తెలిపిన ఆయన.. నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని అన్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినట్టు గుర్తుచేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇతర పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీగా జరిమానాలు విధించడం వల్ల అవినీతి చోటుచేసుకుంటుందన్న వాదనను ఆయన ఖండించారు. అంతటా కెమెరా నిఘా పెట్టామని, మరి అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందన్నారు.