సుప్రీం వాదనల వేళ ట్విస్ట్.. లక్షద్వీప్ ఎంపీ ఫైజల్పై అనర్హత వేటు ఎత్తేసిన లోక్సభ
* లోక్సభ సెక్రటేరియట్ నిరాకరణతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫైజల్
సుప్రీం వాదనల వేళ ట్విస్ట్.. లక్షద్వీప్ ఎంపీ ఫైజల్పై అనర్హత వేటు ఎత్తేసిన లోక్సభ
Mohammed Faizal: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. NCP నేత మహమ్మద్ ఫైజల్పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్సభ సెక్రటేరియట్ ఎత్తివేసింది. ఫైజల్పై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్సభ సెకట్రేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్ రావడం గమనార్హం. ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది జనవరి 11న కవరట్టి సెషన్స్ కోర్టు మహమ్మద్ ఫైజల్కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అదే నెల 13న లోక్సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు వేస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. అనంతరం ఆయన తన జైలు శిక్షను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన కోర్టు ఆయనకు విధించిన శిక్షపై స్టే విధించింది. అయినప్పటికీ ఫైజల్పై అనర్హతను లోక్సభ సెక్రటేరియట్ ఎత్తివేయలేదు. తాను పార్లమెంటుకు వచ్చినప్పటికీ.. భద్రతా సిబ్బంది సభలోపలికి అనుమతించడం లేదంటూ ఇటీవల ఆయన సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియల్ ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం గమనార్హం.