ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన, కఠిన ఆంక్షల నేపథ్యంలో జమ్ము కశ్మీర్లో 73వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కశ్మీరీ పండిట్లను తిరిగి తమ సొంత ప్రాంతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాద నిరోధానికి తీసుకుంటున్న చర్యల్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు.
జమ్మూకశ్మీర్లో సైనిక విధుల్లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాడు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ లద్దాఖ్లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నాడు. లద్దాఖ్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో ధోనీ బుధవారమే అక్కడికి చేరుకున్నాడు. ఇందులో భాగంగా లద్దాఖ్లోని ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడి సిబ్బంది, సైనికులతో కొద్దిసేపు ముచ్చటించాడు. జమ్ములో బీజేపీ నాయకుడు రవీంద్ర రైనా గుజ్జర్ కమ్యూనిటీ ప్రజలతో కలిసి స్వాతంత్ర దినోత్సవేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబట్టి డాన్సులు చేశారు. జమ్ము కశ్మీర్ చరిత్రలో ఈ రోజు మరచిపోలేనిదని రవీంద్ర రైనా అన్నారు. అంతకు ముందు బీజేపీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీ చేపట్టారు.
దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన లద్దాఖ్ ఎంపీ జామ్యాంగ్ స్వాతంత్ర వేడుకల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా వాదిద్యాలు వాయిస్తూ ఎంజాయ్ చేశారు. లేహ్ ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బీజేపీ జాతీయ ప్రతినిధి రాంమాధవ్ పాల్గొన్నారు. లద్ధాఖ్ ప్రజల 72 ఏళ్ల కల నెరవేరిన ఈ క్షణాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. లేహ్ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టు కున్నాయి. స్టూడెంట్స్ చేసిన స్పెషల్ ప్రోగ్రామ్ ప్రత్యేకతను చాటుకున్నాయి.