ఢిల్లీ ప్రజలకి కేజ్రివాల్ కీలక సూచనలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకి కీలకమైన సూచనలను సూచించారు. సామాజిక దూర నిబంధనలను కచ్చితంగా పాటించాలని,
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకి కీలకమైన సూచనలను సూచించారు. సామాజిక దూర నిబంధనలను కచ్చితంగా పాటించాలని, క్రమశిక్షణ చూపాలని కోరారు. లాక్డౌన్ నాలుగవ దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన సందర్భంగా అయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. "కొన్ని ఆర్థిక కార్యకలాపాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. క్రమశిక్షణను అనుసరించడం మరియు కరోనావైరస్ వ్యాధిని నియంత్రించడం మన బాధ్యత. మాస్కులు, చేతి శానిటైజర్లు మరియు సామాజిక దూరం కచ్చితంగా అవసరం.. మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మీరు క్రమశిక్షణతో ఉంటే, దేవుడు మనకి కచ్చితంగా సహాయం చేస్తాడు " అని కేజ్రీవాల్ ట్విట్టర్లో హిందీలో పేర్కొన్నారు.
ఇక ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ ని మే 31 వరకు కొనసాగిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి విదితమే. మెట్రో రైళ్ళు తప్ప మిగిలిన ప్రజారవాణాకి కేజ్రివాల్ అనుమతి ఇచ్చారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించవచ్చని ఆయన చెప్పారు. అయితే సాధ్యమైనంత వరకు ఉద్యోగులతో వర్క్ ఫ్రం హోం చేయించాలని అయన సూచించారు. అంతేకాకుండా సినిమా హాల్స్, బహిరంగ, మత సంబంధమైన సమావేశాలకి బంద్ చెప్పింది ఢిల్లీ ప్రభుత్వం.. ఇక చిన్న పిల్లలు, వయసు పై బడిన వారు బయటకు రాకుందని స్పష్టం చేసింది.
ఇక ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,554కి పెరిగింది. ఇందులో 5,638 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 166 మంది మరణించగా, 4,750 మంది నయమై డిశ్చార్జి అయ్యారు. ఇక అటు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 100,328కి చేరింది. దీంతో కరోనా బాధితులు లక్ష దాటిన దేశాల జాబితాలో భారత్ 11వ స్థానంలో నిలిచింది. అటు మరణాల సంఖ్య 3,156కి చేరింది.