ఉత్తరాదిని ముంచెత్తుతున్న వర్షాలు.. వారం రోజులుగా అసోంలో వరదల బీభత్సం
Heavy Rains: అసోం, హిమాచల్ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్లో వరదలు
ఉత్తరాదిని ముంచెత్తుతున్న వర్షాలు.. వారం రోజులుగా అసోంలో వరదల బీభత్సం
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుంచి వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ.. గురుగ్రామ్లోని వివిధ ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది. గత 24 గంటల్లో ముంబయి దాని చుట్టపక్కల ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అంధేరీ, మలద్, దాషిర్లు ముంపు బారినపడ్డాయి. మహారాష్ట్రలోని రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబయి, థానే, సింధుదుర్గ్లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలకు 200 మంది విదేశీ టూరిస్ట్లు చిక్కుకుపోయారు. కాగా ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు అన్ని మూసివేయడంతో కేదార్నాథ్ యాత్ర నిలిచిపోయింది.
ముంబయి, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బంగాళాఖాతం మరియు గుజరాత్లోని కచ్ ప్రాంతంలోని సినోప్టిక్ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గుజరాత్లోని కచ్ ప్రాంతంలో వాయుగుండం మరియు మహారాష్ట్ర మీదుగా కోస్తా కర్ణాటక వరకు చురుకైన ద్రోణి ఏర్పడ్డాయి. దీంతో కొంకణ్ సహా తీర ప్రాంతాల్లో 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
ఢిల్లీ, ముంబై నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. ఆరు దశాబ్దాల క్రితం ఇలా జరిగిందని గుర్తు చేసిన అధికారులు.. చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ముంబయి సహా మహారాష్ట్ర మొత్తం విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత ముందుకు కదలి మిగతా ప్రాంతాలకు చేరుకుంటాయని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. మరో వైపు దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణ, తమిళనాడుల్లో రుతుపవనాలు నిలకడగా ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.