తమిళనాడులోని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. 35 కేజీల బంగారు నగలు, వజ్రాలు ఎత్తుకెళ్లారు. అపహరణకు గురైన వజ్రాభరణాల ధర సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. దుకాణం వెనక గోడకు కన్నంపెట్టి, ముఖాలకు మాస్కులు ధరించి షాపు లోపలికి వెళ్లారు దొంగలు. డిస్ప్లేలలో ఉంచిన బంగారాన్నంతా కాజేశారు. చోరీ అనంతరం దొంగలు బయటకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అర్ధరాత్రి 2 లేదా 3 గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.