క్షమాపణలు చెప్పనన్న మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్
ఆపరేషన్ సిందూర్పై తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు.
మహారాష్ట్ర: ఆపరేషన్ సిందూర్పై తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పుణెలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ మొదటి రోజే భారత్ యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలో తాజాగా తన వ్యాఖ్యలను ఆయన సమర్ధించుకున్నారు. ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో మారణహోమం సృష్టించిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాక్ ప్రయోగించిన అనేక డ్రోన్స్, మిసైళ్లను గగనతలంలోనే భారత్ ధ్వంసం చేసింది. పాక్కు చెందిన పలు యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది.
పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. తాజాగా తన మాటలను సమర్థించుకున్న నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. తత పార్టీ సభ్యుడి వ్యాఖ్యలను ఖండించకపోవడం రాహుల్ గాంధీ మైండ్ సెట్ను తెలియజేస్తోందని విమర్శించారు. సైన్యాన్ని అవమానించడంపై కాంగ్రెస్ పార్టీ తీరని దుయ్యబట్టారు. పృథ్వీరాజ్ చవాన్తో పాటు రాహుల్ గాంధీ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సైన్యాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఇలాంటి వ్యా ఖ్యలు చేసేవారికి దేశ ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్ లాల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ ఝార్ఖండ్ నేత, లోక్సభ ఎంపీ సుఖ్దియో భగత్ మాట్లాడుతూ, పృథ్వీరాజ్ చవాన్ కు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనే చెప్పాలన్నారు. సైన్యంపై తమకు గౌరవం ఉందని, ఉగ్రవాదం, పాక్పై పోరులో ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని చెప్పారు.