కర్ణాటకలో విషాదం నెలకొంది. రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలోని పాఠశాల వసతి గృహంలో విద్యుత్ షాక్తో అయిదుగురు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. కొప్పల్లోని దేవరాజ్ ఉర్స్ రెసిడెన్షియల్ స్కూల్ వసతిగృహంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో అనుకోకుండా ఆ పోల్ హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకింది. దీంతో పోల్ పట్టుకున్న ఇద్దరు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు విద్యార్థులు కూడా అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.