Corona Virus: కరోనా మళ్లీ వస్తోందా?.. ఒక్కరోజులోనే 335 కేసులు, ఐదుగురు మృతి

Corona Virus: రాష్ట్రాలను అలర్ట్‌ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Update: 2023-12-18 13:30 GMT

Corona Virus: కరోనా మళ్లీ వస్తోందా?.. ఒక్కరోజులోనే 335 కేసులు, ఐదుగురు మృతి

Corona Virus: భారత్ లో మళ్లీ కరోనా వైరస్ ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఒక్కరోజులోనే దేశంలో 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవించడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కరోజులోనే ఐదుగురు మృతి చెందారన్న వైద్యారోగ్య శాఖ వార్నింగ్‌తో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది.

అన్ని రాష్ట్రాలనూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. 24 గంటల్లో... భారత్‌లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తేలింది. ఐదుగురు కరోనా వైరస్ కారణంగా మరణించినట్టు సమాచారం. వీరిలో నలుగురు కేరళ రాష్ట్రంలోనే మరణించారు. మరొకరు ఉత్తర్‌ప్రదేశ్‌లో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు..

గత రెండేళ్లుగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్‌ను వేగంగా వేయడంతో మరణాల సంఖ్య కూడా లేదు. వైరస్ కేసులు కూడా తగ్గాయి. దీంతో ప్రజలు సాధారణ జీవితానికి అలవాటుపడిపోయారు. దీంతో కరోనా వైరస్ పీడ దేశాన్ని వదిలిపోయిందనే అందరూ భావించారు. కానీ మొదలయింది. పోయిందనుకున్న పీడ మళ్లీ మొదలయిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 1,701 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా.

కరోనా కేసులు ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 4.50 కోట్లు నమోదు కాగా, అందులో 4.46 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నప్పటికీ చలికాలం ఈ వైరస్ మరింత ప్రబలే అవకాశముందంటున్నారు. కేరళలో కొత్తరకం వేరియంట్ జేఎన్ 1 కేసులు కూడా నమోదుకావడంతో మరింత ఆందోళనకు గురి కావాల్సి వస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News