ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు.. అమిత్ షా రాజీనామా చేయాల్సిందే : సోనియా
ఢిల్లీ అల్లర్లను నియంత్రించడంలో కేంద్రం విఫలం చెందిందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే అల్లర్లు చోటు చేసుకున్నాయని బాద్యత వహించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని సోనియాగాంధీ మరోసారి డిమాండ్ చేశారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తీరును కూడా ఆమె తప్పుబట్టారు.
ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ రాజధర్మాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశామని తెలిపారు. ఢిల్లీలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, అహ్మద్పటేల్, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లతో కలిసి రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు.