సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. జులై 1 నుంచి 15 వరకు ఈ పరీక్షలు జరుగనున్నట్లు గతంలో షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. గురువారం సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జులై 1 నుంచి 15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఐసీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది.
పరీక్షలు రాసే విద్యార్థులు వైరస్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉన్నట్లు విద్యార్థులు తల్లితండ్రులను సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ సమాచారం ఇచ్చింది.