ఇది ఊహించని షాక్. మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లింగ్ మలుపు తిరిగాయి. రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్గా నిలిచింది. రాత్రికి రాత్రే రాజకీయాల్లో పరిణామాలు మారాయి. మొత్తానికి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్లో ఫడ్నవీస్చే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ -ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ నుంచి ఊహించని షాక్ తగిలింది. సీఎంగా ఉద్దవ్ ఠాక్రేను ప్రకటించిన మరుసటి రోజే తెర వెనుక ఉహించని పరిణామాలు జరిగాయి. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎంగ ప్రమాణం చేశారు. అంతలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇటు ఎన్సీపీలో భారీ చీలిక వచ్చినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం కావాలని కిచిడీ ప్రభుత్వం కాదన్నారు సీఎం ఫడ్నవీస్. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారన్నారు. కానీ ఫలితాల తర్వాత ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు శివసేన ప్రయత్నించిందని ఆరోపించారు. దాని వల్లే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించామన్నారు. ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్. రైతుల సమస్యలపై మహారాష్ట్ర అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. అందుకే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు అజిత్ పవార్ చెప్పారు. రెండోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు
మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణాలు శరద్ పవార్కు తెలియకుండా అజిత్ పవార్ జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీకి మద్దతు ప్రకటించి, ఎన్సీపీలో చీలిక తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 144 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఎన్సీపీలో అజిత్ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో పాటు స్వంతంత్ర సభ్యుల మద్దతులో బలనిరూపణ చేస్తారని తెలుస్తోంది.
మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై శరద్ పవార్ ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు ఎన్సీపీ నిర్ణయం కాదని తమకు తెలియకుండానే అంత జరిగిపోయిందన్నారు. అజిత్పవార్ నిర్ణయానికి మద్దతు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతివ్వాలన్నది అజిత్పవార్ వ్యక్తిగత నిర్ణయమని దీంతో ఎన్సీపీకీ సంబంధం లేదన్నారు. ఇక ఎన్సీపీ, శరద్ పవర్ అనూహ్య నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్ మండిపడుతున్నాయి. రాష్ట్రపతి పదవి కోసం పవార్ ఇలా కుటిల రాజకీయాలకు పాల్పడ్డారంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇక మాట తప్పిన నేతగా మరాఠా రాజకీయ చరిత్రలో నిలిచిపోతారని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.