ఉన్నావ్ ఘటనను నిరసిస్తూ ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఆందోళనకు దిగారు. యూపీ అసెంబ్లీ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. ఉన్నావ్ నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఉన్నావ్ ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు అఖిలేష్ యాదవ్ పిలుపునిచ్చారు.
మృత్యువుతో పోరాడుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి 11.40 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్కు చెందిన ఆమెపై గత డిసెంబరులో దుండగులు అత్యాచారం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరిన ఆమెను ప్రధాన నిందితులు దారిలో అటకాయించారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. బాధితురాలు కేకలు వేస్తూ కిలోమీటరు మేర పరుగులు తీసింది. ఓ వ్యక్తి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు బాధితురాలుండే ప్రదేశానికి చేరుకుని సత్వర చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఎయిర్ ఆంబులెన్స్లో ఢిల్లీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది.