24,600 మంది భారతీయులను బహిష్కరించిన 81 దేశాలు

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు.

Siramdasu Nagarjuna
Published on: 28 Dec 2025 12:07 PM IST
24,600 మంది భారతీయులను బహిష్కరించిన 81 దేశాలు
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపిన వివరాలలో ఒక్క సౌదీ అరేబియా నుంచే 11,000 మందికి పైగా భారతీయులు తిరస్కరణకు గురైనట్టు పేర్కొంది. భారతీయులను అత్యధికంగా వెనక్కి పంపే దేశం అమెరికా అని అని అందరూ అనుకుంటారు. కానీ, అది వాస్తకం కాదు. అత్యధిక బహిష్కరణలు సౌదీ అరేబియా నుంచి జరిగాయి. అమెరికా నుంచి దాదాపు 3,800 మంది భారతీయులను వెనక్కి పంపారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిసెంబర్ 18న రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.

సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండటం, సరైన పర్మిట్లు లేకుండా పనిచేయడం, స్థానిక కార్మిక నిబంధనలను ఉల్లంఘించడం, ఇతర సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వంటి కారణాల వల్ల భారతీయులు ఎక్కువ మంది బహిష్కరణకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి ఎక్కువ మంది నైపుణ్యత తక్కువ కలిగిన కార్మికులు కావడం, ఏజెంట్ల వల్ల మోసపోవడం, కొన్నిసార్లు తెలియక చిన్న తప్పులు చేయడం వల్ల కూడా బహిష్కరణకు గురవుతున్నారు.

అమెరికాలో అక్కడ వీసా స్టేటస్, వర్క్ పర్మిట్, ఇతర పత్రాలను కఠినంగా తనిఖీ చేస్తున్నారు. వీసా గడువు ముగిసిన వారు, అనుమతి లేకుండా పనిచేసినవారు, నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు. అమెరికా నుంచి గత ఐదేళ్లలో అత్యధికంగా బహిష్కరణలు నమోదయ్యాయి. 2025లో సౌదీ, అమెరికా తర్వాత భారతీయులను ఎక్కువగా బహిష్కరించిన దేశాల్లో మలేషియా (1,485), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1,469), మయన్మార్ (1,591) ఉన్నాయి.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story