Mumbai: ముంబైకి చెందిన చిన్నారికి 16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్

Mumbai: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.16 కోట్ల ఖరీదు చేసే ఇంజెక్షన్ అందజేత

Update: 2021-02-28 05:52 GMT

ఫైల్ ఇమేజ్ 

Mumbai: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముంబైకి చెందిన చిన్నారి టీరాకు 16 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ జోల్ జీన్ స్మా ఇంజెక్షన్ ను అందించారు. వివరాల్లోకి వెళితే.... ముంబయికి చెందిన చిన్నారి టీరా ఎంతో అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ వ్యాధి బారినపడింది. ఆ పాప తల్లిదండ్రులు ప్రియాంక, మిహిర్ కామత్ లకు కోట్లు ఖర్చు చేసి వైద్యం చేయించేంత స్తోమత లేదు. దాంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు, నిధులు సేకరించారు. ఈ వ్యాధికి భారత్ లో ఔషధాలు దొరికే పరిస్థితి లేకపోవడంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. దీని ఖరీదు అక్షరాలా రూ.16 కోట్లు. ఇప్పటివరకు ఈ ఖరీదైన ఇంజెక్షన్ ను ప్రపంచవ్యాప్తంగా 11 మంది పిల్లలకు మాత్రమే అందించారు.

చిన్నారి టీరా పరిస్థితిపై స్పందించిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయడంతో పీఎంవో ఉదారంగా స్పందించింది. ఆ ఇంజెక్షన్ దిగుమతిపై రూ.6.5 కోట్ల మేర సుంకాలు రద్దు చేసి ఊరట కలిగించింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ ఎంతో అరుదైన వ్యాధి. దీనికి చికిత్స కూడా అత్యంత వ్యయభరితమైన అంశం. ఈ చికిత్సలో అందించే జోల్ జీన్ స్మా అనే ఇంజెక్షన్ ఖరీదు ఏమాత్రం ఊహించలేం. 

Tags:    

Similar News