కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ బాటలోనే తమిళనాడు కూడా నడిచింది. తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపనున్నట్లు సీఎం పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణించనున్నట్లు ప్రకటించారు. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ నుంచి 80 శాతం మార్కులు, 20 శాతం హాజరు ఆధారంగా మార్కులు కేటాయిస్తామని పళనిస్వామి తెలిపారు. ప్రభుత్వ ప్రకటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన నిర్ణయమని విద్యావేత్తలు భావిస్తున్నారు.