ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోక్సో చట్ట (2012) సవరణకు ఆమోదం తెలిపింది. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష పడేలా చట్టానికి సవరణ చేయనుంది. అలాగే, చైల్డ్ పోర్నోగ్రఫీకి పాల్పడితే జరిమానా, జైలు శిక్ష విధించేలా చట్టాన్ని సవరణ చేయనుంది. దేశంలోని లక్షలాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికులకు మేలు చేసే 'కార్మిక రక్షణ కోడ్'కు ఆమోద ముద్ర వేసింది. 13 కేంద్ర కార్మిక చట్టాలను ఈ 'ఒకే కోడ్' పరిధిలోకి తీసుకురానుంది. వాణిజ్యం, వ్యాపారం, తయారీ, సేవా, ఐటీ వంటి అన్ని రంగాల కార్మికులకు ఈ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కార్మికులు ఆరోగ్య రక్షణ, భద్రత వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఉద్యోగుల సంఖ్య 10 మందికి పైగా ఉండే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్ వర్తిస్తుంది.
అలాగే, సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ చట్టబద్దమైనది కాదని ప్రకటన చేసింది. పంజాబ్ సహా పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్పీఎఫ్ సర్వీసులకు గ్రూప్-ఎ హోదా కేటాయించాలని నిర్ణయించారు. ప్రధాని గ్రామ సడక్ యోజక మూడోవిడత పనులకు ఆమోదం
తెలిపింది కేంద్ర కేబినేట్. రూ.80,250 కోట్లతో లక్షా 25 వేల కి.మీ రోడ్ల నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల పరిష్కార చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.