భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ ఏఎన్ -32 విమానం అదృశ్యమైంది. విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. అసోంలోని జొర్హాత్ విమానాశ్రయం నుంచి సోమవారం మధ్యాహ్నం 12.24కు ఈ విమానం బయల్దేరింది. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని మెన్చుకా వైమానిక స్థావరానికి చేరాల్సిఉంది. అయితే,గాలిలోకి ఎగిరిన 35 నిమిషాల తర్వాత విమానంతో గ్రౌండ్ సిబ్బందికి సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుఖోయి-30 యుద్ధ విమానంతో పాటు సీ-130 ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్ను అధికారులు రంగంలోకి దించారు.
కాగా, ఏఎన్-32 విమాన అదృశ్యంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ''కొన్ని గంటలుగా ఆచూకీ తెలియకుండా పోయిన ఐఏఎఫ్ ఏఎన్-32 ఎయిర్క్రాఫ్ట్ గురించి భారత వైమానిక దళ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ భాదౌరియాతో మాట్లాడాను. దాని ఆచూకీ కనుగొనేందుకు ప్రారంభించిన ప్రయత్నాల గురించి ఆయన నాకు వివరించారు. అందులో ఉన్న వారి క్షేమ సమాచారం కోసం ప్రార్థిస్తున్నాను'' అని ట్వీట్ చేశారు.