The Wedding of VIROSH:పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
పెళ్లిపై సంచలన ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
The wedding of Virosh : టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ ప్రేమ బంధంపై అధికారిక ముద్ర వేశారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెర దించుతూ, తమ పెళ్లి వార్తను అత్యంత వినూత్నంగా, భావోద్వేగభరితంగా ప్రకటించారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ శుభ లేఖ సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ పెళ్లి వార్తలను పత్రికా ప్రకటనల ద్వారా చెబుతారు. కానీ, విజయ్-రష్మిక జోడీ మాత్రం తమను ఇంతకాలం గుండెల్లో పెట్టుకున్న అభిమానులకే ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఆదివారం రాత్రి ఇన్స్టాగ్రామ్లో వారు షేర్ చేసిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మా గురించి మేము ఏమీ నిర్ణయించుకోకముందే.. కనీసం ఎటువంటి ప్రణాళికలు వేసుకోక ముందే మీరు మా పక్కన ఉన్నారు. మా ప్రయాణాన్ని గమనిస్తూ మాకు తోడుగా నిలిచారు" అంటూ అభిమానుల పట్ల తమకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు.
విజయ్ లోని 'VI', రష్మిక లోని 'ROSH' కలిపి అభిమానులు ఎప్పుడో సృష్టించిన పేరు "విరోష్". ఇప్పుడు అదే పేరును తమ వివాహ వేడుకకు అధికారిక నామకరణంగా మారుస్తున్నట్లు ఈ జంట ప్రకటించింది. మీరు మాకు ఒక పేరు ఇచ్చారు.. మమ్మల్ని 'విరోష్' అని పిలిచారు.. అందుకే మా కలయికకు మీ గౌరవార్థం ఆ పేరునే పెడుతున్నాం అంటూ వారు చేసిన ప్రకటన నెటిజన్ల మనసు గెలుచుకుంది. కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికలా కాకుండా, కోట్లాది మంది అభిమానుల సెంటిమెంట్ను గౌరవిస్తూ "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" గా ఈ వివాహాన్ని అభివర్ణించారు.
రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నారని ఎన్ని వార్తలు వచ్చినా, ఇన్ని రోజులు మౌనంగా ఉన్న ఈ జంట.. ఒక్కసారిగా పెళ్లి కార్డు పంపిణీ దాకా వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అప్పటికే ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందాయని, పెళ్లి పనులు కూడా దాదాపు పూర్తయ్యాయని సమాచారం. విజయ్ దేవరకొండ తన మార్క్ స్టైల్లో అభిమానులను కూడా ఈ వేడుకలో భాగస్వాములను చేయడం విశేషం.
ప్రస్తుతం సోషల్ మీడియాలో #ViRash , #ViRoshWedding అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్లో ఉన్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒక్కటవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.