ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు పూర్తి.. కేవలం ఐదుగురే
విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ బుధవారం 53 సంవత్సరాల వయసులో ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే.
విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ బుధవారం 53 సంవత్సరాల వయసులో ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కూడా ముగిశాయి. మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా కబ్రిస్తాన్ లో ఇర్ఫాన్ ఖాన్ పార్ధివదేహాన్ని ఖననం చేశారు. కుమారులు బాబిల్ , అయాన్ తండ్రికి చివరి కార్యక్రమాలు చేశారు. కుటుంబసభ్యులు మినహా.. దగ్గరి బంధువులు, స్నేహితులు ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. వారంతా ఇర్ఫాన్ పార్థివదేహానికి తుది నివాళులు అర్పించి, సంతాపం తెలిపారు.
కాగా మంగళవారం పెద్దప్రేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్చారు. అయితే బుధవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇర్ఫాన్ 2018 నుండి న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్నాడు. ఇదిలావుంటే గత శనివారమే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు. అయితే, దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా జైపూర్లో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇప్పుడు ఇర్ఫాన్ కూడా మృతి చెండంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు