Chiranjeevi: అప్పటి ప్రజారాజ్యమే.. నేటి జనసేన.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు.
అప్పటి ప్రజారాజ్యమే.. నేటి జనసేన.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
Chiranjeevi: లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి.. చాలా కాలం తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజా రాజ్యం, జనసేన అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి.
విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు గురించి మాట్లాడుతూ.. కరాటే రాజు 17 ఏళ్ల క్రితమే తనతో కలసి ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని అన్నారు. అభిమానులంతా ఒక్కసారిగా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అంటూ నినాదం చేశారు. ఈ క్రమంలోనే నాటి ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా మారిందన్నారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు.
2008 ఆగష్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజారాజ్యం 18 స్థానాలు గెలుచుకుంది. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరంజీవి నుంచి పోటీ చేస్తే, తిరుపతి స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2011లో కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. అప్పట్లో కేంద్రమంత్రిగా కూడా ఆయన కొనసాగారు. అప్పటి నుంచి చిరంజీవి ఎప్పుడూ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడు సడన్గా ప్రజారాజ్యం, జనసేన అంటూ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
చిరంజీవికి త్వరలో కేంద్రమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది. న్యూదిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మోదీ కూడా ఉన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో చిరంజీవిని గురించి మోదీ ప్రస్తావించారు. ఈ పరిణామాలతో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారనే చర్చ తెరమీదికి వచ్చింది. ఈ ప్రచారంపై చిరంజీవి అధికారికంగా స్పందించలేదు. తాజాగా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి పాలిటిక్స్ గురించి మాట్లాడం చర్చకు దారితీస్తోంది. రాజకీయాల గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి.
ఇక విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం లైలా. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నారు.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్ గా నిలిచింది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహూ గార్లపాటి నిర్మించారు. ఈ మూవీలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.