తెలుగుదేశం ప్రభుత్వం ఏపీ పోలీసులను పావులుగా వాడుకుంటుందని వైసీపీ నాయకురాలు డాక్టర్ శ్రీదేవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని రైతులను వేధించడం ఏంటని శ్రీదేవి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు. అయితే ల్యాండ్ పూలింగ్కు భూములను ఇవ్వని రైతులను తెలుగుదేశం నాయకులు నానారకలుగా ఇబ్బందులతో వేధించారని గుర్తుచేశారు.
కాగా చంద్రబాబు శాఖమూరులో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తానని చెప్పి ఇప్పటి వరకు అక్కడ ఒక్క ఇటుక పెళ్ల కూడా వేయలేదని తెలిపారు. పైగా అక్కడకి వెళ్లిన వైసీపీ నాయకులు మేరుగ నాగర్జునను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. అలాగే రైతు రాంమీరా ప్రసాద్ భూమిలోకి వెళ్లడానికి సీఆర్డీఏ, ఏడీసీ, రెవెన్యూ అధికారులకు ఏం హక్కు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే టీడీపీ అధినేత, ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటినైతే రోడ్డు విస్తరణకు ఇస్తారా అని శ్రీదేవి ప్రశ్నించారు. మాదాపూర్లోని లోకేశ్ సైట్లో రహదారి నిర్మిస్తే ఊరుకుంటారా అని నిలదీశారు.