బీసీల బతుకులు మెరుగుపర్చి వారి తలరాతను మార్చుతానని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షడు జగన్ అన్నారు. నిన్ప పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే సబ్ప్లాన్ పెడతామని 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.
తన పాదయాత్ర ద్వారా బీసీల కష్టాలను కళ్లారా చూశానని వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నిన్న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వెనుకబడిన వర్గాలకు సంబంధించి డిక్లరేషన్ ప్రకటించిన జగన్ బీసీలపై వరాల వర్షం కురిపించారు. అధికారంలోకి రాగానే బీసీల అభివృద్ధికి ఏటా 15 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. సబ్ ప్లాన్ పెట్టి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్దత కల్పిస్తామన్నారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్న జగన్ మహిళలకు నాలుగు దఫాల్లో 75 వేల రూపాయలను ఉచితంగా ఇస్తామన్నారు. బీసీ విద్యార్థులకు 20 వేలు, స్కూలుకు పంపినందుకు తల్లిదండ్రులకు 15 వేలు ఇస్తామని జగన్ వివరించారు.
రాజకీయ పదవుల్లో, ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ కమిటీల్లో, కార్పొరేషన్ పదవులు వంటి నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 50శాతం ఇస్తామన్నారు. దీని కోసం మొదటి అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకొస్తామని జగన్ తెలిపారు. ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీస వేతనం ఇవ్వడంతో పాటూ బోర్డు మెంబర్లుగా నాయీ బ్రాహ్మణులు, యాదవులతో పాటూ బీసీలకు అవకాశం కల్పిస్తామని జగన్ తెలిపారు. పేదవారు మరణిస్తే వైఎస్సార్ బీమా కింద 7 లక్షలు ఇస్తామన్నారు.
మరోవైపు తెలంగాణలో 32 బీసీ కులాలకు అన్యాయం జరిగిందని దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను మాట్లాడతానని జగన్ తెలిపారు. కేసీఆర్ అమరావతికి వస్తే అప్పుడు చంద్రబాబు ఆయన ఎదుట ఎందుకు ప్రస్తావించలేదని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు బీసీలపై చిత్తశుద్ది లేదని తేల్చిచెప్పారు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లపై తనకు జగన్ హామీ ఇచ్చారని బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రధానిని చాలాసార్లు కలిశానని చెబుతున్న చంద్రబాబు, ఒక్కసారైనా బీసీల రిజర్వేషన్ల కోసం మాట్లాడారా..? అని ప్రశ్నించారు. డబ్బులకు, ప్రలోభాలకు, మాటలకు బీసీలు మోసపోవద్దని కృష్ణయ్య పిలుపునిచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దక్కనున్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవికి బీసీ నేత జంగా కృష్ణమూర్తిని ఎన్నుకుంటామని జగన్ తెలిపారు.