తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్...కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చేసే దిశగా...
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ తిరుగులేన రాజకీయ శక్తిగా అవతరించింది. మహాకూటమి పేరుతో మెజార్టీ పక్షాలు ఏకమై పోటీ చేసినా కేసీఆర్ ఒంటి చేత్తో పార్టీని గెలిపించి వన్ ఆర్మీగా అవతరించారు.
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ప్రారంభమైందా ? తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్, టీడీపీలను ఖాళీ చేసే దిశగా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా? గులాబి గూటికి చేరుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారా ? గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు బలమైన నేతలకు కారులో చోటు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారా ?
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ తిరుగులేన రాజకీయ శక్తిగా అవతరించింది. మహాకూటమి పేరుతో మెజార్టీ పక్షాలు ఏకమై పోటీ చేసినా కేసీఆర్ ఒంటి చేత్తో పార్టీని గెలిపించి వన్ ఆర్మీగా అవతరించారు. ఇదే ఊపులో టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో విపక్ష సభ్యులకు పార్టీ సీనియర్లు గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో బాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీఎం కేసీఆర్పై గత రెండు పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప రెడ్డి కాంగ్రెస్కు చెయ్యిచ్చి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఉన్న ఒంటేరును పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా హస్తం పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వాలని గులాబి నేతలు భావిస్తున్నారు. అన్ని కుదిరితే ఈ రోజే సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఒంటరు గులాబి కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి విజయం సాధించిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే ముందుగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించి సభకు రావడం ఆనవాయితి. ప్రమాణ స్వీకారం రోజున టీ టీడీపీ ఏర్పాట్లు చేసినా సండ్ర హాజరు కాకపోవడం పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
ఇక కాంగ్రెస్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కూడా పలువురు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కారు ఎక్కేందుకు సిద్ధమయినట్టు ప్రచారం జరుగుతోంది. సీఎల్పీ నేత ఎంపిక తరువాత అసంతృప్తులు, అశావాదులు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాలను ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నా పార్టీ మార్పు ప్రచారం మాత్రం ఆగడం లేదు. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ ఎప్పుడు ఎవరిని ఎలా ఆకర్షిస్తుందో తెలియక తికమక పడుతున్నాయి.