10 మంది కొత్తవారు అందులో తొమ్మిది మంది తొలిసారి లోక్సభ బరిలో ఉన్నారు నలుగురు వారసులు వారిలో ముగ్గురికి తొలిసారి అవకాశం రాష్ట్రంలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వారిలో కొత్తవారే అత్యధికంగా ఉన్నారు.
కొందరికి అస్సలు రాజకీయాలతో సంబంధం లేదు. మరికొందరికి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఇంకొందరి కుటుంబ సభ్యులు పార్టీలో ఉన్నారు. అయినా వారందరికీ టీఆర్ఎస్ లోక్సభ టికెట్లు లభించాయి. నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి దిల్సుఖ్నగర్లోని రాజధాని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్. ఈయనకు మంత్రి జగదీశ్రెడ్డి మద్దతుంది. ఎంపీ గుత్తాను బరిలోకి దింపాలని ఆలోచించారు. ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చినందున, సర్వేలో నర్సింహారెడ్డికి అనుకూలంగా ఉన్నందున ఎంపిక చేశారు.
మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డికి టికెట్ రాదని తెలిసిన తర్వాత ఔషధ సంస్థ ఎంఎస్ఎస్ అధినేత మన్నె శ్రీనివాసరెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఆయనకు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. చేవెళ్లకు సంబంధించి గడ్డం రంజిత్రెడ్డి మంత్రులు ఈటలకు సన్నిహితుడు. పలువురు ఆయనకు మద్దతు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడైన సాయికిరణ్కు సీఎం టికెట్ కేటాయించారు.
మల్కాజిగిరి టికెట్ కోసం పార్టీ నేత నవీన్రావు మర్రి రాజశేఖర్రెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది. అక్కడ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి సీటు ఖరారు కావడంతో.. రేవంత్ ను ఎదుర్కోడానికి మర్రి రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పెద్దపల్లి నుంచి బొర్లకుంట వెంకటేశ్ను పార్టీలోకి తీసుకొని పెద్దపల్లి టికెట్ ఇచ్చింది. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవిత మహబూబాబాద్ టికెట్లు పొందారు. ఇక ఈ మధ్యే పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావు ఖమ్మం టికెట్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసిన వారిలో ఆరుగురు రాజకీయాలకు కొత్త వారు. ఇక మన్నె శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డిలకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు.