లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు గులాబి బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించిన ప్రచార వ్యూహాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేస్తున్నారు. సెంటిమెంట్ని ఫాలో అవుతూ మళ్లీ కరీంనగర్ నుంచే ప్రచారం మొదలు పెడుతున్నారు. 16 లోక్సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు టీఆర్ఎస్ నేతలు.
పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాల్లో పోటీ చేసి 16 లోక్సభ సీట్లను కైవశం చేసుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై 106 బహిరంగ సభలలో పాల్గొని, 90 సీట్లు సాధించిన గులాబీ దళపతి కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నా,రు. పార్టీ ఆవిర్భావం నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా కరీంనగర్ నుంచే ప్రారంభించడం కేసీఆర్ సెంటిమెంట్. లోక్సభ ఎన్నికల ప్రచారానికి అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తున్నారు.
ఆదివారం నుంచే సీఎం కేసీఆర్.. లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. కరీంనగర్లోని ఎల్ అండ్ టీ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సుమారు రెండు లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివస్తారని అంచనా. ఇప్పటికే ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలీకాఫ్టర్లో కేసీఆర్ కరీంనగర్ చేరుకుంటారు.
మొత్తం 20 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. పెద్ద లోక్సభ నియోజకవర్గాల్లో రెండేసి బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు విడివిడిగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈనెల 19న నిజామాబాద్లో జరిగే బహిరంగసభకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. అనంతరం అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల కార్యక్రమాలు జరుగుతాయి. గడిచిన ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ లోపాలతో పాటు ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండనుందో కేసీఆర్ ఈ సభల ద్వారా తెలియచేయనున్నారు.